nellore :
మేకపాటి కుటుంబం పార్టీ మారుతుందన్న ప్రచారాన్ని ఖండించిన కార్యాలయం
మేకపాటి కుటుంబం పార్టీ మారుతుందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని మేకపాటి వారి కార్యాలయం స్పష్టం చేసింది.

మేకపాటి కుటుంబం తరఫున ఎలాంటి పార్టీ మార్పు నిర్ణయం తీసుకోలేదని, ఈ మేరకు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని పేర్కొంది.
మేకపాటి కుటుంబానికి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో దశాబ్దాల అనుబంధం ఉందని, సోనియా గాంధీ అధికారంలో ఉన్న సమయంలోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచిన రాజకీయ నేపథ్యం తమ కుటుంబానికి ఉందని తెలిపింది.
వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా, తన రాజకీయ నిబద్ధత కోసం లోక్సభ సభ్యత్వానికే రాజీనామా చేసిన నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అని గుర్తు చేసింది. అలాంటి విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న కుటుంబం పార్టీ మారుతుందంటూ ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొంది.
వాస్తవాలను నిర్ధారించుకోకుండా నిరాధార వార్తలు, ప్రచారాలను వ్యాప్తి చేయడం బాధ్యతారాహిత్యమని, ప్రజలు ఇటువంటి అసత్య ప్రచారాలను విశ్వసించవద్దని మేకపాటి వారి కార్యాలయం విజ్ఞప్తి చేసింది.


