
స్వేచ్ఛాయుత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు
ఎన్నికల సన్నద్దతపై జిల్లా యంత్రాంగానికి అభినందనలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్
విజయనగరం, ఫిబ్రవరి, 01: జిల్లాలో నిర్వహించనున్న గ్రామ పంచాయితీ ఎన్నికలను స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డా.ఎన్.రమేష్ కుమార్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణపై సమీక్షించారు. జిల్లా కలెక్టర్ డా.ఎం. హరి జవహర్ లాల్ జిల్లాలో ఎన్నికల సన్నద్దతపై ఎన్నికల కమిషనర్ కు వివరించారు. శాంతి భద్రతలు, బందోబస్తు అంశాలపై జిల్లా ఎస్.పి. బి.రాజకుమారి వివరించారు. విజయనగరం ఆర్.డి.ఓ. భవానీ శంకర్, డి.ఎస్.పి. అనీల్, పార్వతీపురం సబ్ కలెక్టర్ విధేఖరే డి.ఎస్.పి. మోహనరావు ఎన్నికల ఏర్పాట్లపై, పోలింగ్ స్టేషన్లు, ఓటర్లు, మేన్ పవర్ ,రూట్లు, జోన్లు, శిక్షణలు, సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు, మోడల్ కోడ్ అమలు తదితర అంశాలను పవర్ పాయింట్ ద్వారా ఎన్నికల కమిషనర్ కు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటించేలా అవసరమైన మాస్కులను, శానిటైజర్లను పోలింగ్ బూత్ ల వద్ద సిద్దంగా వుంచామని డిఎం అండ్ హెచ్ ఓ డా. రమణ కుమారి వివరించారు. అదనపు ఎస్.పి. శ్రీదేవి రావు మాట్లాడుతూ అక్రమ మధ్యం సరఫరాను అరికట్టడానికి గట్టి నిఘా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు.
అనంతరం ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ విజయనగరం జిల్లా ప్రశాంతమైన జిల్లా అని, ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతాయనే నమ్మకం వుందన్నారు. పంచాయితీ ఎన్నికల నిర్వహణకు చేసిన ఏర్పాట్ల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు అధికారులకు పరీక్ష వంటివని, సక్రమంగా నిర్వహిస్తే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల కాల్ సెంటర్ కు వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలు పెద్దఎత్తున ఓటింగులో పాల్గొనేలా అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో శాంతియుతంగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లు పట్ల జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్.పి. అధికారులను అభినందించారు. కోవిడ్ సేవల్లో బాగంగా జిల్లా ఎస్.పి.రాజకుమారి జాతీయ స్థాయి అవార్డును అందుకోవడం పట్ల పత్యేకంగా అభినందించారు.
ఈ సమావేశంలో అదనపు డి.జి. ఎన్. సంజయ్, డిఐజి ఆఫ్ పోలీస్ కె.రంగారావు, ఎన్నికల పరిశీలకులు ఎస్.నాగలక్ష్మీ, సంయుక్త కలెక్టర్లు డా.జి.సి. కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్, ఐటిడిఎ పిఓ ఆర్.కూర్మనాద్, సహాయ కలెక్టర్ సింహాచలం, డిఆర్ఓ గణపతిరావు, డిపిఓ సునీల్ రాజ్ కుమార్, నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
Comments are closed.