
సూపర్ స్టార్ రజినీకాంత్ తాను నటించిన సినిమాల్లో ఒక డైలాగ్ చాలా ప్రాచుర్యం పొందింది. ఆ డైలాగే ఈ బాబా లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. ఈ డైలాగ్ లాగే మన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఈరోజు విశాఖ ఉక్కు పై స్పందించడం తో.. లేటుగా స్పందించిన లేటెస్ట్ గా స్పందించినట్టు ఉంది వ్యవహారం. గతంలో ‘సౌత్ 9’లో ‘ఆంధ్ర అవసరం టాలీవుడ్ పెద్దలకు లేదా’ అనే కథనంలో తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యవహారంపై స్పందించడం లేదని కథనం రాసిన సంగతి విధితమే. ఇప్పుడు చిరంజీవి తన ట్విట్టర్ ఖాతా ద్వారా విశాఖ ఉక్కు మన అందరి హక్కు అని, రాజకీయాలకతీతంగా విశాఖను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని , దీనికి తన మద్దతు పూర్తిగా ఉంటుందని తెలియజేశారు. అయితే ఈ రోజే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కి వ్యతిరేకంగా మద్దతిస్తామని, అవసరమైతే విశాఖపట్నానికి వచ్చి తమ నిరసన తెలియజేస్తామని చెప్పిన తర్వాత చిరంజీవి స్పందించడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో ఒక చిరంజీవే కాక టాలీవుడ్ పెద్దలు మొత్తం స్పందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.




Comments are closed.