
తెలుగు రాష్ట్రాల్లో నవశకం
ఉమ్మడి అజెండా దిశగా అడుగులు
దీర్ఘకాలిక సమస్యలపై సుహృద్భావ చర్చలు
విభజన అంశాలపై కీలక దశ
పరస్పర సమన్వయంతో ముందుకు సాగుదాం అంటూ పిలుపు
ఆస్తుల పంపకం, ఉద్యోగుల విభజన, కంపెనీల వ్యవహారాలు,

నాది జలాల వంటి సున్నితమైన అంశాలపై లోతుగా చర్చ
పరస్పరం అభినందించుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
పెద్ద ఎత్తున పాల్గొన్న రెండు రాష్ట్రాల మంత్రులు మరియు అధికార గణం
మరోసారి జరగనున్న చర్చల
హైదరాబాద్, జూలై 6::తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ శనివారం సాయంత్రం విజయవంతంగా ముగిసింది. విభజన చట్టంలోని వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రజాభవన్ వేదికగా రేవంత్ రెడ్డి, చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. ఈ భేటీలో సుమారు పది అంశాలు చర్చించడం జరిగింది. తొమ్మిది, పదో షెడ్యూల్ లోని సంస్థల పంపిణీ సహా విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల విభజన వంటి చిక్కుముళ్లపై సమాలోచనలు జరిపారు.విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా, హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు, అపరిష్కృతంగా ఉన్న అంశాలపై భేటీలో చర్చ కొనసాగింది. ముందుగా జూబ్లీహిల్స్ నుంచి ప్రజాభవన్కు చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు, సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. అనంతరం ప్రజాభవన్లోకి చేరుకున్న చంద్రబాబును శాలువతో సత్కరించిన రేవంత్రెడ్డి, కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని బహుకరించారు. అనంతరం విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది.

తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు సాగేందుకు, ఉమ్మడిగా అభివృద్ధి సాధించేందుకు ఈ ఇద్దరు ముఖ్యనేతల మీటింగ్కు వేదికైంది. ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తెలంగాణతో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ
ఈ సమావేశంలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు తదితరులు చర్చల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, రహదారులు భవనాలశాఖ మంత్రి జనార్దన్రెడ్డి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి పీయూశ్ కుమార్తో పాటు రెండు రాష్ట్రాల ప్రభుత్వ సీఎస్లు శాంతికుమారి, నీరబ్కుమార్ ప్రసాద్తో పాటు ఇతర శాఖల అధికారులు పలువురు హాజరయ్యారు.
విభజన వివాదాలపై అధికారుల మధ్య సుమారు 30 సమావేశాలు జరిగితే, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కావడం మాత్రం ఇదే తొలిసారి. విభజన చట్టం 9, పదో షెడ్యూళ్లలోని సంస్థలు, ఆస్తులపైనే ముఖ్యమంత్రులు ప్రధానంగా చర్చించారు.
ఎజెండాలోని అంశాలివే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ జరిగి దశాబ్ద కాలం గడిచింది. నాటి నుంచి కీలకాంశాలు ఎన్నో పెండింగ్లో ఉండిపోయాయి. అధికారుల స్థాయిలో కొన్నిసార్లు చర్చలు జరిగినా చాలా విషయాలు కొలిక్కి రాకుండా అలానే పెండింగ్లో ఉన్నాయి. సీఎంల భేటీ సందర్భంగా ఉమ్మడిగా ఎజెండా అంశాలను ఖరారు చేశారు.
రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టం షెడ్యూలు 9, షెడ్యూలు10లో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు,
విభజన చట్టంలో పేర్కొనని కంపెనీల ఆస్తుల పంపకాలు,
ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు,
విద్యుత్తు బిల్లుల బకాయిలు వంటి అంశాలపై చర్చించారు.
విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాల వివరాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది.
Comments are closed.