
ఐక్య పోరాటంతోనే చిన్న పత్రికలకు మనుగడ
– ఎపిఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి ఢిల్లీబాబు రెడ్డి
విశాఖపట్నం, మార్చి 22: చిన్న తరహా పత్రికలను ప్రభుత్వం ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో సమాచార శాఖాధికారులు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐకమత్యంగా పోరాడడం ద్వారానే తమ హక్కులను సాధించుకోవచ్చునని ఆయన పిలుపునిచ్చారు. స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఎస్. వీరభద్రరావు ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని విశాఖ సమాచారం దినపత్రిక కార్యాలయంలో ఆదివారం నాడు జరిగిన సమాశానికి ఢిల్లీబాబు రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చిన్న పత్రికలకు అక్రిడిటేషన్లు, అడ్వర్టయిజ్మెంట్లు జారీ చేసేందుకు తీసుకున్న చర్యలను వివరించారు. రాజన్న రాజ్యం తెస్తానని అధికారంలోకి వచ్చిన జగన్మోహన రెడ్డి చిన్న పత్రికల విషయంలో తన తండ్రి రాజశేఖరరెడ్డి విధానాలను విస్మరించడం విచారకరమని అన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అక్రిడిటేషన్ల విధానంలో తీసుకు వచ్చిన జీవోలు, వాటిలో లోపాలు వివరించారు. నూతన జివోల వల్ల రాష్ట్రంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వివరించారు. గత ఏడాది కాలంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈ విషయంలో సాగిస్తున్న న్యాయ పోరాటం గురించి ఆయన వివరించారు. పలు చిన్న పత్రికల ఎడిటర్లు, పబ్లిషర్లకు ఎపిఎంఎఫ్ పోరాటాల గురించి వివరించి వారి సందేహాలను నివృత్తి చేశారు. అక్రిడిటేషన్ల విధానంలో జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడుతున్నందునే ఎపిఎంఎఫ్ పైనా, తన పైనా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన చెప్పారు. 60 ఏళ్ళ పైబడి, 16 ఏళ్ల పైబడి చరిత్రలు చెప్పుకుంటున్న జర్నలిస్ట్ యూనియన్లు, వాటి నాయకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం, పదవుల కోసం జర్నలిస్టుల సంక్షేమాన్ని తాకట్టు పెట్టారని ఢిల్లీబాబు రెడ్డి ఆరోపించారు. కేవలం నాలుగేళ్ల కాలంలో ఎపిఎంఎఫ్ రాష్ట్రంలో ప్రభావశీల శక్తిగా ఎదిగిందని, జర్నలిస్టుల సంక్షేమం కోసం రాజీ లేని పోరాటం సాగిస్తోందని ఆయన వివరించారు. చిన్న పత్రికల మధ్య వృత్తిపరమైన పోటీ ఉండాలని, అదే సమయంలో హక్కుల సాధన కోసం ఐకమత్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిన్న పత్రికల యాజమాన్యాల కోసం తొలి ప్రయత్నం చేసిన విశాఖ సమాచారం ఎడిటర్ వీరభద్రరావును ఆయన అభినందించారు. చిన్న పత్రికల పోరాటానికి ఎపిఎంఎఫ్ ఎల్లప్పుడూ బాసటగా నిలుస్తుందని ఢిల్లీబాబు రెడ్డి హామీ ఇచ్చారు. లీడర్ దినపత్రిక ఎడిటర్ రమణమూర్తి మాట్లాడుతూ చిన్న పత్రికల సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేద్దామని అన్నారు. ప్రభుత్వ నిబంధనలలో మార్పులతో పాటు సోషల్ మీడియా వ్యాప్తి కారణంగా చిన్న పత్రికల మనుగడ కష్టమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న పత్రికల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ద్వారా ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిద్దామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం చిన్న పత్రికలకు స్వర్ణ యుగం అని ఆయన గుర్తు చేశారు. విశాఖ సమాచారం ఎడిటర్ వీరభద్రరావు మాట్లాడుతూ చిన్న పత్రికలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు, వాటిని అధిగమించడానికి తీసుకోవల్సిన చర్యలను వివరించారు. ఆంధ్రా వాయిస్ ఎడిటర్ బి. గిరిబాబు, గోదావరి దినపత్రిక ఎడిటర్ బోళ్ళ సతీష్ బాబు, రాయల కాకతీయ ఎడిటర్ ప్రభాకర నాయుడు, స్థానిక జర్నలిస్ట్ ప్రముఖులు ఉమాకాంత్, ఈశ్వర్ చౌదరి, కృష్ణారావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Comments are closed.