కర్నూలు : రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా నిర్మించిన విమానాశ్రయం. కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయం ను
సీఎం జగన్ ప్రారంభించారు. ఆయనతో పాటు కేంద్రమంత్రి పి హర్దీప్ సింగ్ కుమార్ కూడా ఓర్వకల్లు ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్, కేంద్రమంత్రితో కలిసి ఎయిర్ పోర్ట్ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ముందుగా సీఎం జగన్ జాతీయ జెండాను, ఆ తర్వాత దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతోందని సీఎం జగన్ తెలిపారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు విమానాలు అందుబాటులో ఉంటాయిని తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్ పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు రిబ్బన్ కటింగ్ తో హడావుడి చేసిందని, రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్ తెలిపారు. అధునాతన అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో ఉంటుందని, ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్ పోర్టు కు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు. ఇండిగో సంస్థ ఈనెల 28 నుంచి విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనుంది. 1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి చేశారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న లైసెన్స్ జారీ చేయగా బీసీఏఎస్ సెక్యూర్టీ క్లియరెన్స్ జనవరి 27న మంజూరైంది. 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో ఇక్కడి రన్వే ను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్ తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.
చరిత్రలో నిల్చిపోయే రోజు : ‘కర్నూలు జిల్లా చరిత్రలో ఇవాళ మర్చిపోలేని రోజు. ఇది ఎప్పటికీ నిల్చిపోతుంది. కారణం ఏమిటంటే ఇప్పటి వరకు కర్నూలు నుంచి ప్రయాణం అంటే రోడ్డు లేదా రైలు మార్గమే అందుబాటులో ఉండగా, ఇక నుంచి విమానయానం కూడా వచ్చింది. అందుకే ఈరోజును కర్నూలు జిల్లా ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. ఈనెల 28 నుంచి ఇక్కడి నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం నగరాలకు సర్వీసులు నడుస్తాయి. ఒకేసారి 4 విమానాలు ఇక్కడ పార్కు చేసుకునే వీలుంది’.
6వ విమానాశ్రయం : ‘ఇప్పటి వరకు రాష్ట్రంలో5 విమానాశ్రయాలు ఉండగా, ఇది 6వ విమానాశ్రయం కాబోతున్నది. ఇప్పటికే తిరుపతి, కడప, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నంలో విమానాశ్రయాలు ఉండగా, ఇప్పుడు ఆ జాబితాలో కర్నూలు విమానాశ్రయం కూడా చేరింది’.
ప్రతిష్టాత్మక విమానాశ్రయం :‘ఈ ఓర్వకల్లు విమానాశ్రయం.. రాష్ట్రంలో మనందరం నిర్మించుకోబోతున్న న్యాయ రాజధానిని, మిగతా రాష్ట్రాలతో సమానంగా, గర్వంగా నిలబడుతుందని తెలియజేస్తున్నాను’.
పనులు పూర్తి కాకున్నా: ‘ఈ విమానాశ్రయానికి సంబంధించి గతంలో మీకు బాగా గుర్తుండే ఉంటుంది. ఎన్నికలకు కేవలం నెల రోజుల గడువు ముందు, విమానాశ్రయం నిర్మాణం ఏ మాత్రం పూర్తి కాకున్నా, కనీసం అనుమతులు లేకపోయినా, విమానాలు ఎగరలేని పరిస్థితుల్లో, కనీసం రన్వే కూడా పూర్తి కాకముందే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు వచ్చి, ఇక్కడ రిబ్బన్ కట్టింగ్ కూడా చేశారు. దాన్ని మనమంతా కళ్లారా చూశాం’.
ఏడాదిన్నర వ్యవధిలోనే : ‘అప్పటి నుంచి దాదాపు రెండేళ్లు గడిచాయి. ఇదే కర్నూలులో ఇక్కడ కచ్చితంగా విమానాశ్రయం రావాలని, పట్టుదలతో రూ.110 కోట్లు ఖర్చు చేసి, కేవలం ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అడ్మిన్ బిల్డింగ్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, వీఐపీ లాంజ్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషను, రన్వే లోని బ్యాలెన్సు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేశాం’. ఆస్ట్రియా నుంచి దిగుమతి చేసుకున్న రెండు అత్యాధునిక అగ్నిమాపక శకటాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంచాం. ప్యాసింజర్ టర్మినల్ వద్ద కార్ రెంటల్, బేబీ కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలు కల్పించాం’.
వారందరికీ అభినందనలు : ‘ కర్నూలు విమానాశ్రయానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ), పౌర విమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) అనుమతులు రప్పించడంలో మన మంత్రి, మన అధికారులు ఎంతో పని చేశారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను’.
ఉయ్యాలవాడ పేరు : ‘దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది. బారత జాతీయ కాంగ్రెస్ 1885లోనే పుట్టింది. 1915లో గాంధీగారు మన దేశానికి తిరిగి వచ్చారు. 1917లో తొలిసారిగా బిహార్లోని చంపారన్లో తొలి సత్యాగ్రహం జరిగింది. అయితే వీటన్నింటి కంటే ముందు ఈ కర్నూలు గడ్డ మీద, స్వాతంత్య్రానికి 100 ఏళ్ల ముందే మొదటి స్వాతంత్య్ర పోరాటం జరిగింది’. ‘1847లోనే రైతుల పక్షాన, పరాయి పాలకుల గుండెల్లో నిద్ర పోయిన ఒక మహా స్వాతంత్య్ర యోధుడు ఈ గడ్డ నుంచే వచ్చాడు. ఆయనే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈరోజు ఆయనకు నివాళిగా ఇవాళ ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే పేరు పెడుతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను’.
మరింతగా పని చేస్తాను: దేవుడి దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు, ఇటీవలి స్థానిక ఎన్నికల్లో అఖండ విజయం ఇచ్చారు. మీరంతా మాకు మద్దతుగా నిల్చారు. మద్దతు పలికారు. మీ అందరి కోసం ఇంకా మరింతగా పని చేస్తానని ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మకు, ప్రతి ఒక్క సోదరుడికి, ప్రతి ఒక్క స్నేహితుడికి నిండు మనసుతో తెలియజేస్తూ, మీ అందరి ఆప్యాయతలకు శిరస్సు వంచి సెలవు తీసుకుంటున్నాను’.. అంటూ సీఎం వైయస్ జగన్ ప్రసంగం ముగించారు. ఆ తర్వాత కర్నూలు విమానాశ్రయం చిత్రంతో రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను సీఎం ఆవిష్కరించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, మేకపాటి గౌతమ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Prev Post
Comments are closed.