The South9
The news is by your side.

రాయలసీమలో అత్యధికంగా ఏకగ్రీవాలే..‌

post top

*తొలిరోజు ఏకగ్రీవాలు 222*
కడప జిల్లాలో 100
*పులివెందులలో అన్ని వార్డుల్లోనూ సింగిల్‌ నామినేషన్‌*
విజయవాడ : తొలి రోజు నామినేషన్ల ఉపసంహరణ తరువాత పుర, నగరపాలక, నగర పంచాయతీల్లో 222 డివిజన్‌, వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. వీటిలో 221 చోట్ల వైకాపా అభ్యర్థులే. రాయలసీమలోని కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అత్యధిక చోట్ల ఉపసంహరణల తరువాత అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల సింగిల్‌ నామినేషన్లు మిగిలాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు ప్రకటించాల్సి ఉంది. మంగళవారం రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం.. నామినేషన్ల ఉపసంహరణల తరువాత ఏకగ్రీవమవుతున్న వాటిలో కడప జిల్లాలో అత్యధికంగా 100 డివిజన్‌, వార్డు స్థానాలున్నాయి. ఈ జిల్లాలో పులివెందుల పురపాలక సంఘంలోని 33 వార్డుల్లోనూ సింగిల్‌ నామినేషన్లు మిగిలాయి. రాయచోటిలో 28, కడప నగరపాలక సంస్థలో 17 డివిజన్లు ఏకగ్రీవమవుతున్నాయి. 37 స్థానాలతో ఏకగ్రీవాల్లో చిత్తూరుజిల్లా రెండో స్థానంలోనిలుస్తోంది. పుంగనూరులో 16, పలమనేరులో 15, చిత్తూరు నగరపాలక సంస్థలో ఆరు డివిజన్లలో సింగిల్‌ నామినేషన్లు మిగిలాయి. కర్నూలు జిల్లాలోనూ 36స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. అనంతపురం జిల్లాలో 13 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం కానున్నారు. ధర్మవరం పురపాలక సంఘంలో పది వార్డు స్థానాల్లో సింగిల్‌ నామినేషన్లు మిగిలాయి. నెల్లూరు జిల్లాలో 11, ప్రకాశం జిల్లాలో 9 డివిజన్‌, వార్డు సభ్యుల స్థానాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు పురపాలక సంఘంలో ఒక వార్డు స్థానంలో తెదేపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు.

- Advertisement -

- Advertisement -

- Advertisement -

Comments are closed.